రూ.2 వేల కోట్లకు చేరిన ఆన్‌లైన్ బెట్టింగ్ స్కాం

గత వారం  తెలంగాణ రాష్ట్రంలో బ‌య‌ట‌ప‌డిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌ రూ 2,000 కోట్లకు చేరుకుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. రెండు అకౌంట్ల నుంచి చైనాకు నిధులు బదిలీ అయినట్టు గుర్తించారు. దాకి పే, లింక్ యూ కంపెనీల పేర్లతో నిధులు బదిలీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఢిల్లీకి చెందిన ధీరజ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదటగా రూ 1,100 కోట్ల స్కామ్ జరిగినట్లు పోలీసులు భావించారు. అయితే మరొక రెండు కొత్త అకౌంట్లను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. 

సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను కోర్టు కస్టడీకి ఇచ్చింది. ఇప్పటికే పేటీఎం ప్రతినిధులను పోలీసులు ప్రశ్నించగా మరో వైపు ఈడీ, ఆదాయ పన్ను శాఖలు సైతం దర్యాప్తు చేపట్టాయి. 

ప్రధాన నిందితుడు ధీరజ్ దొరికితే మరింత విలువైన సమాచారం రాబట్టవచ్చని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.