చైనాకు ‘వందే భారత్‌’ రైల్వే టెండర్ల రద్దు  

‘వందే భారత్‌’లో భాగంగా 44 సెమీ హైస్పీడ్‌ రైల్వే తయారీకి ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారం రోజుల్లోగా మళ్లీ టెండర్లు పిలిచి ఖరారు చేస్తామని, కేంద్రం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

చైనాకు ఈ టెండర్‌ వెళ్లేలా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చైనాకు మరో దెబ్బ తగిలినట్లయింది. చైనా జాయింట్ వెంచర్,  సీఆర్‌ఆర్‌సీ పయనీర్‌ ఎలక్ట్రిక్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ 44 సెట్ల సెమీ హైస్పీడ్ రైళ్లను సరఫరా చేసే ఆరుగురు పోటీదారుల్లో ఏకైక విదేశీ బిడ్డర్‌గా ఉంది. ‘సెమీ హైస్పీడ్‌ రైలు 44 సెట్ల (వందేభారత్‌) తయారీ టెండర్‌ రద్దయింది.

సవరించిన పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ (మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాధాన్యత) ఆర్డర్‌ ప్రకారం వారం రోజుల్లోగా తాజాగా టెండర్‌ ఇవ్వనున్నట్లు’ రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.  చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ యోంగ్జీ ఎలక్ట్రిక్‌ కంపెనీ లిమిటెడ్‌, గురుగ్రామ్‌కు చెందిన పయనీర్‌ ఫిల్‌-మెడ్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య 2015లో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటైంది.

ఒక దేశీయ సంస్థ టెండర్‌ను తీసుకునేలా రైల్వే టెండర్‌ ఇచ్చింది. అయితే చైనా జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టు ముందు వరసలో ఉందని భావించిన అనంతరం టెండర్లను రద్దు చేసింది. చెన్నైలోని ఇండియన్ రైల్వేస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జూలై 10న టెండర్‌ను ఖరారు చేసింది.

మిగిలిన ఐదు బిడ్డర్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఇండస్ట్రీస్, సంగ్రూర్, ఎలక్ట్రోవేవ్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేధా సర్వో డ్రైవ్స్ ప్రయివేట్ లిమిటెడ్, పవర్ నెటిక్స్ ఎక్విప్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

జూన్‌లో తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికే  భారత్ పలు విధాలుగా ప్రతి స్పందించింది, స్నేహపూర్వక దేశాలతో దౌత్య పరమైన ఒత్తిడిని తేవడంతో పాటు సౌర శక్తి పరికరాల వంటి చైనా ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. భారీ యూజర్లను కలిగి ఉన్న టిక్‌టాక్‌ సహా 59 చైనీస్‌ యాప్‌లను బ్లాక్‌ చేసింది.

భారతీయ సంస్థలు ఒక చైనా కంపెనీకి అనుకూలంగా టెండర్ ఉందని ఆరోపణలు రావడంతో రైల్వేలు ఇప్పటికే కొవిడ్‌-19 నిఘా కోసం ఉద్దేశించిన థర్మల్‌ కెమెరాల కోసం జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసింది.  డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా జూన్ మధ్యలో సరిహద్దు ఘర్షణ జరిగిన కొన్ని రోజుల తరువాత ఒక చైనీస్ సంస్థతో రూ.470 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసింది.