వీధి వర్తకుల రుణాల కోసం మొబైల్ యాప్ 

`ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులకు రుణసదుపాయం కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పిఎం స్వనిధి పథకం ద్వారా రుణాలకు దరఖాస్తు సులభంగా చేసుకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ను రూపొందించింది. 
 
ఈ పథకం అమలు తీరుతెన్నుల మీద వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖామంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పట్టణాభివృద్ధి కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, డిజిపి లు, కలెక్టర్లు, ఎస్పీలు, 125 నగరాల మున్సిపల్ కమిషనర్లు, సీఈవోలతో జరిపిన సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్య్వహారాల మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఈ యాప్ ను ఆవిష్కరించారు. .   
పిఎం స్వనిధి పథకం సమర్థవంతంగా అమలు జరిగేందుకు, వీధి వర్తకుల జీవనోపాధికి రక్షణ ఉండేటట్లు చూడాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వారిని కోరారు.  ఈ పథకం ద్వారా వారికి రునసదుపాయం కలుగుతుండగా, ఎలాంటి వేధింపులూ లేని వాతావరణంలో వారు వ్యాపారం నడుపుకునేలా అవకాశం కల్పించాలని సూచించారు.
పథకం లబ్ధిదారులందరి  సామాజిక-ఆర్థిక స్థితిగతుల సర్వే జరిపి వారికి పిఎం ఎ వై, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వల, జన్ ధన్ యోజన సౌభాగ్య తదితర ప్రభుత్వ పథకాల అందుబాటు గురించి కూడా తెలుసుకోవాలని మంత్రి  ఈ సందర్భంగా చెప్పారు. 
 
తోపుడు బండ్లవారు సంప్రదాయ బండ్ల స్థానంలో ఆధునిక బండ్లను  కొనుక్కునే విధంగా రాష్ట్రాలు వీధి విక్రేతలకు ఇతర పథకాల లబ్ధి పొందే అవకాశాల గురించి కూడా చెప్పి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.  పోలీసులు, మున్సిపల్ అధికారులు అనవసరంగా వీధి వర్తకులను హింసిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. 
 
అలా వ్యవహరించే అధికారులను గుర్తించి వారిమీద చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా లబ్ధిదారుల ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించటానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక వేదిక ఏర్పాటు చేసి అందులో పోలీసులకు పట్టణ అధికారులకు భాగస్వామ్యం కల్పించాలని, ఈ వేదిక నెలకు ఒకసారైనా సమావేసం కావాలని మంత్రి సూచించారు. 
 
స్వనిధి కేవలం ఒక మైక్రో ఫైనాన్స్ పథకం కాదని, ఇది పట్టణ ఆర్థిక వ్యవస్థలో వీధి విక్రేతలకు భాగస్వామ్యం కల్పించే ప్రక్రియ అని మంత్రి తెలిపారు. ఆ విధంగా ఇతర పథకాలను కూడా వాడుకుంటూ పేదరిక నిర్మూలను కృషి చేసే లక్ష్య సాధనలో భాగమని చెప్పారు. రుణాలిచ్చే సంస్థలతో కలిసి త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
 
పి ఎం స్వనిధి పోర్టల్ లో రుణ దరఖాస్తులకు జులై 2 నుంచి అవకాశం కల్పించగా మొత్తం 5.68  లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1.30  లక్షల దరఖాస్తులకు రుణం మంజూరైంది. 
 
ఈ విధంగా సూక్ష్మ రుణాలను వీధివర్తకుల గడప దగ్గరికే తీసుకెళ్ళే విధంగా రుణాలిచ్చే సంస్థలకోసం ఒక యాప్ ను ఇప్పటికే  మంత్రిత్వశాఖ రూపొందించగా అది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ప్రధాని జూన్ 1న పిఎం స్వనిధి పథకాన్ని ఆవిష్కరించారు. 
 
కోవిడ్ సంక్షోభం కారణంగా దెబ్బతిన్న వీధి వర్తకులు తమ వ్యాపారాలను, తద్వారా జీవనోపాథిని పునరుద్ధరించుకోవటానికి నిర్వహణ మూలధనంగా ఈ రుణాలు ఉపయోగపడతాయి. 
 
దీనికింద వర్తకులకు రూ. 10,000 వరకు అప్పుగా లభిస్తుంది. దీన్ని నెలవారీ వాయిదాల్లో ఏడాదిలోపు తిరిగి చెల్లించవచ్చు. సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి 7శాతం చొప్పున వడ్డీ సబ్సిడీని  తిరిగి వారి ఖాతాల్లో మూడు నెలలకొకసారి నేరుగా జమచేస్తారు.
 
ముందుగా కట్టేస్తే ఎలాంటి పెనాల్టీలూ ఉండవు. ఇది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే పథకం కూడా. వీధి విక్రేతలు ఆర్థికంగా పైకి ఎదగాలన్న లక్ష్యం నెరవేర్చుకోవటానికి వీలుగా వారు సకాలంలో అప్పుతీర్చే కొద్దీ మరింత అప్పు మంజూరయ్యే అవకాశం ఉంది.