ఉగ్రవాదం కేసులో బెంగళూరు ఆప్తాల్మజిస్ట్‌ 

ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందనే ఆరోపణతో బెంగళూరులో ఓ ఆప్తాల్మజిస్ట్‌ను అరెస్టు అయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని ఎంఎస్ రామయ్య వైద్య కళాశాలలో ఆప్తాల్మజిస్ట్‌గా పని చేస్తున్న అబ్దుర్ రహమాన్‌ (28)ను అరెస్టు చేశారు. 
 
రహమాన్‌కు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని జామియా నగర్‌, ఓఖ్లా విహార్‌ నుంచి జహాన్‌జెయిబ్ సమి వని, ఆయన భార్య హీనా బషీర్ బేగ్‌లను అరెస్టు చేశారు. 
 
వీరిద్దరూ కశ్మీరీలు. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో భాగమైన ఐఎస్‌కేపీతో సంబంధాలు ఉన్నట్లు నిర్థరణ అయింది.  వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా రహమాన్‌ను అరెస్టు చేశారు. 

అబ్దుర్ రహమాన్‌ను ప్రశ్నించినపుడు తాను జహాన్‌జెయిబ్ సమితోనూ, సిరియాలోని మరికొందరు ఐసిస్ ఉగ్రవాదులతోనూ కలిసి పని చేస్తున్నట్లు అంగీకరించాడని ఎన్ఐఏ తెలిపింది. 

సురక్షితమైన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తాము పరస్పరం సంభాషించుకుంటున్నట్లు తెలిపాడని పేర్కొంది. భారత దేశంలో ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్ర పన్నినట్లు అంగీకరించాడని పేర్కొంది. 

ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో గాయపడే ఐసిస్ ఉగ్రవాదులకు సహాయపడేందుకు ఓ మెడికల్ అప్లికేషన్ (యాప్)ను, ఐసిస్ ఉగ్రవాదుల కోసం ఆయుధాలకు సంబంధించిన యాప్‌ను తయారు చేసే పనిలో రహమాన్ ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. 

రహమాన్ 2014లో సిరియా వెళ్ళినట్లు, అక్కడ ఐసిస్ మెడికల్ క్యాంప్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు చికిత్స చేసినట్లు వెల్లడైంది. 10 రోజులపాటు ఆ శిబిరంలో చికిత్సలు అందించి తిరిగి భారత దేశానికి వచ్చినట్లు తెలిసింది. 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌కేపీ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. ఈ కేసులో గతంలో జహాన్‌జెయిబ్ సమి వని, ఆయన భార్య హీనా బషీర్ బేగ్‌, అబ్దుల్ బాసిత్, సదియా అన్వర్ షేక్ అరెస్టయ్యారు. తాజాగా అబ్దుర్ రహమాన్ అరెస్టయ్యాడు.