గణేష్ ఉత్సవాలపై స్పష్టత లేని కేసీఆర్ ప్రభుత్వం 

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్  ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి స్పష్టత లేదని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వినాయక ఉత్సవాల నిర్వహణను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు.

స్పష్టత లేని రాష్ట్ర పాలకులు, అధికారులు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని చెబుతూ ఇది ఆక్షేపనీయం, గర్హనీయమ‌ని స్పష్టం చేశారు. ధార్మిక సంస్థలు, హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వ‌హించుకోవాల‌ని సంజ‌య్ పిలుపిచ్చారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారులు తమ ఇష్టానుసారంగా ఉత్సవాల నిర్వహణకు విరుద్ధంగా నిబంధనలు విధిస్తూ ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులకు బీజేపీ అండగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

సమాజాన్ని సంఘటితం చేసే గణేష్ ఉత్సవాలకు నాంది పలికిన బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలు అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉందని బండి సంజ‌య్ ప్రకటించారు. కోవిడ్ నిబంధనల సాకుతో టీఆర్ఎస్ నేతలు అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు ప్రజలు గమనించాలని కోరారు. 

నిబంధనల పేరిట అధికారులు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను బీజేపీ ధీటుగా ఎదుర్కొటుంద‌ని స్పష్టం చేశారు.