ప్రీప్రైమరీ స్కూళ్లుగా  అంగన్‌వాడీలు 

ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌పై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఇక నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రీప్రైమరీ-1,2లపై విద్యాశాఖ, మహిళా, శిశుసంక్షేమశాఖ అధికారులతో జగన్‌ సమీక్షించారు. 

‘అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌కు రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈ నిధుల సమీకరణపై ఆర్థికశాఖ అధికారులు ప్రణాళికలు వేయాలి. నాడు-నేడు కార్యక్రమం కింద అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీకి కొత్త పాఠ్యప్రణాళికలు అమలు చేయాలి’ అని సూచించారు. 

ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్‌ ఉండాలి. ఈ ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారీ బాధ్యత విద్యాశాఖ చేపట్టాలి. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. అంగన్‌వాడీ వర్కర్లకు ఇప్పుడున్న కనీస విద్యార్హత పదో తరగతి కాగా, వారికి ఏడాదిపాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలని పేర్కొన్నారు. 

బోధనా పద్ధతులు, పాఠ్యప్రణాళికపై వారికి శిక్షణ ఇవ్వాలి. ఇంటర్‌, డిగ్రీ చేసిన వారికైతే ఆరు నెలలు కోర్సు పెట్టాలి. పిల్లలకు సులభమైన మార్గాల్లో విద్యాబోధన చేయాలి. అంగన్‌వాడీల్లో తాగునీరు, బాత్‌రూములు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లోని సదుపాయాలన్నీ ప్రీస్కూళ్లలోనూ ఉండాలని అంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

అమ్మఒడి పథకం ద్వారా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రీప్రైమరీ విద్యలో కూడా అదే బాటలో నడుస్తున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం, చదువులు, పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను వైఎ్‌సఆర్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా పిలవాలని, ప్రీస్కూళ్లకు అవసరమైన భవనాలు నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు.