గిరిజన యూనివర్సిటీ తరలింపును వ్యతిరేకిస్తాం

కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మారు మూల ప్రాంతానికి తరిలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొటక్కి గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. 

ఈ యూనివర్సిటీకి సుమారుగా ఐదు వందల ఎకరాల భూమిని భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలో గత ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆ భూమి కాకుండా విజయనగరం జిల్లాలో ఎయిపోర్టుకు, ఇతర సౌకర్యాలకు చాలా దూరంగా స్థలం కేటాయించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలనే ఆలోచనతో వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. గతంలో కేటాయించిన  కేంద్ర  యూనివర్సిటీ స్థలంలో  అన్ని సౌకర్యాలతో గిరిజనుల కోసం హాస్టల్ నిర్మాణం చేయాలని విధివిధానాలను కూడా రూపొందించారని వీర్రాజు గుర్తు చేశారు.

ఈ యూనివర్సిటీలో గిరిజన విద్యతో పాటు ఇతర అన్ని కోర్సులకు అదే ప్రాధాన్యత ఉంటుందని చెబుతూ కేంద్ర యూనివర్సిటీ అనేవి ఎయిర్ పోర్టుకు, రవాణా సౌకర్యాలు ఉండేలా అధ్యాపక బృందానికి అనుకూలంగా  ఉండాలని ఆయన స్పష్టం చేశారు.  గత ప్రభుత్వం నిర్దేశించిన  ప్రాంతంలోనే గిరిజన  యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

విజయగనరంలో సుదూర ప్రాంతానికి తరలించడం ద్వారా  ఒరిస్సాలోని కోరాపూర్ కు అతి చేరువుగా యూనివర్సిటీ ఏర్పడుతుందని, అలా జరిగితే యూనివర్సిటీ అభివృద్దికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేటాయించిన భూముల్లోనే గిరిజన  యూనివర్సిటీ పెట్టాలని సూచించారు. ప్రభుత్వం వేసిన కమిటీకి  కూడా బీజేపీ తరపున ఇవే అంశాలను వివరిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.