ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ లపై యడియూరప్ప  నిషేధం !

సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) తో పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ను కర్ణాటకలో బిఎస్ యడియూరప్ప ప్రభుత్వం రద్దు చేసే దిశగా సాగుతోంది. బెంగళూరు అల్లర్లలో ఈ పార్టీ హస్తం ఉందని తేలిపోవడంతో పాటు మరికొన్ని కారణాల రీత్యా ఎస్‌డీపీఐ పై నిషేధం విధిస్తారని మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప ప్రకటించారు.

ఈ నెల 20 న జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సమాజంలో అశాంతిని కలిగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున వాటిపై నిషేధం విధించాలని చాలా సమూహాలు, సంస్థలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని ఈశ్వరప్ప తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి, అల్లర్ల కేసులో ఎస్‌డీపీఐ పాత్ర స్పష్టంగా కనబడుతోందని పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. 

దీంతో ఆ సంస్థపై నిషేధం విధించాలని యడియూరప్ప సర్కార్‌పై తీవ్ర ఒత్తిడులు వస్తున్నట్లు తెలుస్తున్నది. రెవిన్యూ మంత్రి అశోక రావు కూడా ఇదే విషయం తెలిపారు. 

ఈ రెండు సంస్థలు సామజిక వ్యతిరేక, జాతీయ వ్యతిరేక చర్యలలో పాల్గొంటున్నట్లు కర్ణాటక పోలీసులు కొంతకాలంగా భావిస్తున్నారు. పలువురు బీజేపీ, కాంగ్రెస్ ఆర్ ఎస్ ఎస్ నేతలపై జరిగిన దాడులలో సహితం వీరి ప్రమేయం ఉన్నట్లు గతంలో పేర్కొన్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం గతంలో కనీసం రెండు సార్లు ఈ రెండు సంస్థలను నిషేదించాలని కేంద్రాన్ని కోరింది.