అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌

దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ మోదీ వెల్లడించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మాట్లాడుతూ ఇంటర్నెట్ విప్లవాన్ని అన్ని గ్రామాలకు తీసుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.
 
 2014 నాటికి దేశంలో  కేవలం ఐదు డజన్ల పంచాయతీలకే అంతర్జాల సౌకర్యం ఉండేదని, ఆరేళ్లలో ఆరున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని, ఆరు లక్షల గ్రామాలకు వేల కిలోమీటర్లు ఆఫ్టికల్‌ ఫైబర్‌ను తీసుకెళ్తున్నామని చెప్పారు. 
 
వచ్చే వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికి ఆఫ్టికల్‌ ఫైబర్‌ విస్తరించనున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న అవసరాలతో పాటు సైబర్‌ రంగంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతూ సైబర్‌ నేరాల కట్టడికి నూతన ఆవిష్కరణల అవసరం ఉందని స్పష్టం చేశారు. త్వరలో కొత్తగా సైబర్‌ సెక్యూరిటీ విధానం తీసుకురానున్నట్లు ప్రధాని ప్రకటించారు.  
కాగా, స్వర్ణ చతుర్భుజి దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైలు, విమానాలు, నౌకాశ్రయాల అభివృద్ధి, అనుసంధానం ప్రారంభించామని, నూతన అనుసంధానం వ్యాపార, వాణిజ్యాన్ని ద్విగుణీకృతం చేస్తుందని చెప్పారు.
 పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల వృద్ధి.. కొత్త ఉపాధిని సృష్టించిందని, పట్టణాల్లో చిరు, వీధి వ్యాపారులకు రుణాల ద్వారా అస్థిత్వాన్ని అందించినట్లు గుర్తు చేశారు. వెనుకబడి జిల్లాల అభివృద్ధి నూతన పథకాలు దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించినట్లు మోదీ తెలిపారు.
వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం నూతన పథకాలు ప్రారంభించామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి కొత్త పథకాలు తెచ్చామని, వ్యవసాయ మార్కెటింగ్‌రంగంలో నూతన శకానికి నాంది పలికామని చెప్పారు. ప్రభుత్వ బంధనాల నుంచి రైతులను విముక్తి చేస్తున్నామని, రైతుల ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, రైతులే స్వయం ఆహార శుద్ధికి ముందుకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, విలువ జోడింపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
స్వచ్ఛమైన తాగునీటితో సగం ఆరోగ్య సమస్యలకు సమాధానం వచ్చని, దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీటి కోసం నిరంతరం ప్రయత్నం సాగుతోందన్నారు. జలజీవన్‌మిషన్‌తో ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుంది ప్రధాని అన్నారు. జల జీవన్ మిషన్‌తో సామాన్య ప్రజలు అనారోగ్యం నుంచి బయటపడుతున్నారని, తాగునీరు అందించేందుకు కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.