తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ మండిపాటు 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వరం పెంచారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రాజెక్ట్ లు చేబట్టిన్నట్లు తిరిగి ఆరోపిస్తూ, తమ ప్రభుత్వం రాయలసీమలో చేబడుతున్న ప్రాజెక్ట్ లు అన్ని పాతవేనని స్పష్టం చేశారు. ఇవ్వన్నీ 2015 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినవే అని గుర్తు చేశారు. 
 
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ గతవారం వ్రాసిన లేఖకు జవాబు వ్రాస్తూ  రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.
 
అయితే కృష్ణ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోందని సీఎం జగన్‌ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు సంబంధించి  సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. 
 
మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందని జగన్ గుర్తు చేశారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని ధ్వజమెత్తారు. 
 
ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదని విచారం వ్యక్తం చేశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించానని తెలిపారు. కానీ రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్‌ విచారం వ్యక్తం చేశారు.