తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అర్ధం పర్ధం లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏపి ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని విమర్శించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సిఎం కేసిఆర్ సమీక్ష నిర్వహిస్తూ కేంద్ర జలశక్తి శాఖా మంత్రి లేఖ, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చించారు.
అనంతరం కేసిఆర్ మాట్లాడుతూ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్ధవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. ” నా అంతట నేను ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు,భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా” అని గుర్తు చేశారు.
వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పిన్నట్లు తెలిపారు. కాని ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఏపి అర్ధరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపికి కల్పిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
More Stories
కాంగ్రెస్ లోకి కేశవరావు, కడియం శ్రీహరి
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు