తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు 

ఈ నెల 11 వ తేదీ నాటికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు సీఎం కేసీఆర్ హాజరు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాని హెచ్చరించారు. కేసీఆర్ ఫాం హౌస్ లో ఉంటడు, ప్రగతి భవన్ నుంచి బయటకు రారు, ఎవరికీ కనబడరని ఎద్దేవా చేశారు. 

అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై హాజరు కాకుండా సీఎంకు అంత బిజీ ఏముందో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం మాట్లాడేందుకు గంట కూడా టైం లేదా అని ప్రశ్నించారు. 

పోతిరెడ్డిపాడు పై కనీసం ఒక్క లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి గానీ, కేంద్రం జలశక్తి శాఖ మంత్రికి గాని రాయలేదని ఆరోపించారు. సీఎం తో పాటు సీఎస్ కూడా లేఖ రాసే పరిస్థితిలో లేదని ధ్వజమెత్తారు. మరి ఎవరి ప్రయోజనాల కోసం సీఎం సీట్లో కూర్చున్నావో చెప్పాలని సంజయ్ నిలదీశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైతే సీఎం కేసీఆర్ కనీసం మాట కూడా మాట్లాడటం లేదని సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఎన్ని వేల కోట్లు కమీషన్లు తీసుకుంటావనిప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ కు హాజరై వాస్తవాలు ఏమిటో చెబితే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టును ఆపేస్తుంది కదా అని నిలదీశారు. 

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు బీజేపీ రాష్ట్ర శాఖ పలుమార్లు లేఖలు రాసిందని గుర్తు చేస్తూ విభజన చట్టం ప్రకారం కేంద్రం రెండు రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు.

ఏపీ నీటిని తరలించుకొని పోతుంటే కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై సీఎం స్పందించకుంటే బీజేపీ కార్యచరణ ప్రకటిస్తుందని సంజయ్ స్పష్టం చేశారు.