కోవిడ్-19పై సమర్ధవంతమైన పోరాటం   

స్వచ్ఛభారత్ మిషన్‌తో భారత్ సాధికారత సాధించడం వల్లే కోవిడ్-19పై సమర్ధవంతమైన పోరాటం చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014కు ముందు కోవిడ్-19 వచ్చి ఉండే పరిస్థితిని ఊహించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 

60 శాతం మంది కనీసం ఇళ్లలో మరుగుదొడ్లు లేక బహిరంగ విసర్జనకే పరిమితమయ్యే వారని, అలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం అసాధ్యమయ్యేదని పరోక్షంగా అప్పటి కాంగ్రెస్ పాలకులకు ప్రధాని చురకలు వేశారు. రాష్ట్రీయ స్వచ్ఛందా కేంద్రాన్ని మోదీ శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 

 ‘గత కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు  గాంధీజీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ మిషన్‌ను తన జీవితాలకు లక్ష్యంగా మలుచుకున్నారు. ఇందుకు అనుగుణంగా కేవలం 60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా ప్రజలకు టాయెలెట్ సౌకర్యాలను మేము కల్పించగలిగాం’ అని మోదీ తెలిపారు.

యావత్ ప్రపంచం మహాత్మాగాంధీ చాటిన విలువలు, సిద్ధాంతాలను అక్కున చేర్చుకుంటోందని చెప్పారు. గత ఏడాది గాంధీజీ 150వ జయంత్యుత్సవాలను కూడా అసాధారణ రీతిలో జరిగాయని గుర్తు చేశారు. 

మహాత్మాగాంధీ ఫేవరెట్ గీతమైన ‘వైష్ణవ్ జన్ తో’ పాడేందుకు వివిధ దేశాలకు చెందిన కళాకారులు ఏకతాటిపైకి వచ్చి గళం విప్పారని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం నిబంధనలు పాటించాలని, మాస్క్‌లు ధరించాలని మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు.

 

మహాత్మాగాంధీ చేపట్టిన చంపారాన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ స్వచ్ఛతా కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్‌కేలో ‘స్వచ్ఛ భారత్ మిషన్’పై రూపొందించిన లఘ విడియోను ప్రధాని తిలకించారు. మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజ్‌ఘాట్‌ వద్ద ఈ స్వచ్ఛ భారత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్‌పై భవిష్యత్ తరానికి దార్శనిక కేంద్రంగా ఆర్ఎస్‌కే నిలుస్తుందని పేర్కొన్నారు.