పాక్ సరిహద్దులో మోహరించిన మహిళా సేనలు 

పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట రైఫిల్ మహిళలను తొలిసారిగా మోహరిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలోని దాల్ ప్రాంతంలోని సాధ్నా పాస్ లో పహారా కాసే విధుల్లో మహిళా సైనికులను నియమించారు. ఈ మహిళా సైనికులను ఉత్తర కశ్మీర్‌లోని టాంగ్‌ధార్ సెక్టార్‌లోని పారా మిలటరీ ఫోర్స్ అసోం రైఫిల్స్ నుంచి డిప్యుటేషన్‌పై మోహరించారు.
 
సుమారు 30 మంది మహిళా సైనికుల బృందానికి కెప్టెన్ గుర్ సిమ్రాన్ కౌర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ఆర్మీ సర్వీస్ కార్ప్స్ కు చెందినది. ఆమె కుటుంబానికి చెందిన మూడవ తరం సైనిక అధికారి కూడా కావడం విశేషం. ఆమె తండ్రి, తాత కూడా సైన్యంలో పనిచేశారు.
 
క్రౌడ్ కంట్రోల్, మహిళా భద్రత ద్వారా భద్రతా తనిఖీ కేంద్రాల కోసం మహిళా సైనికులను ఎల్వోసీ వెంట మోహరించినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు సరిహద్దు దాటి అక్రమంగా రవాణా జరుగుతుండటాన్ని వీరు అడ్డుకుంటారు. 
 
1990 ల మధ్యలో మహిళలను చాలా తక్కువ సంఖ్యలో సైనిక అధికారులుగా నియమించారు. వారికి ఇచ్చిన పని కూడా పరిమితంగానే ఉండేది. ఫైటింగ్ ఆర్మ్స్, ఆర్మర్డ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ ఆఫ్ ఇన్ఫాంట్రీలో మహిళలను చేర్చలేదు. 
 
అయితే, గతంలో ఆర్మీ సీఎంపీలో సుమారు 50 మంది మహిళలను సైనికులుగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మహిళలు శిక్షణ పొందుతున్నారు. దీని తరువాత, భారత సైన్యం సుమారు 800 మంది మహిళలను మిలిటరీ పోలీసుల్లో చేర్చాలని యోచిస్తున్నది.