దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట మృతి 

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖాలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.

పీపుల్స్‌వార్‌ సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై తొలిసారిగా టాడా కేసు నమోదు చేశారు. దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపై నమోదు కావడం గమనార్హం.  అంతకు ముందు జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004లో మొదటి సారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు 

ఆయన 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  సోలిపేటకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.