అయోధ్య‌లో రామార్చ‌న పూజ‌‌.. రేపు 12.30కి భూమిపూజ‌

రామ‌జ‌న్మ‌భూమి ప్రాంతంలో ఈ రోజు రామార్చ‌న పూజ నిర్వ‌హించారు. భూమిపూజ వేడుక‌కు దేవ‌త‌ల‌ను ఆహ్వానిస్తూ రామార్చ‌న పూజ నిర్వ‌హించారు.  హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద కూడా ఇవాళ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద నిషాన్ పూజ చేప‌ట్టారు. హ‌నుమాన్ గ‌ర్హి వ‌ద్ద నిషాన్ పూజ‌ను దాదాపు 1700 ఏళ్ల నుంచి నిర్వ‌హిస్తున్న సంప్ర‌దాయం ఉన్న‌ది.

రామాల‌య నిర్మాణం సంద‌ర్భంగా అయోధ్య‌లో వ‌రుస‌గా మూడు రోజుల పూజ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇవాళ రెండ‌వ రోజు. రామ‌జ‌న్మ‌భూమిలో  ఇవాళ  వైదిక ప‌ద్ధ‌తిలో వాస్తు శాంతి, శిలాసంస్కృతి, న‌వ‌గ్ర‌హ పూజ‌లు కూడా నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు భూమిపూజ ప్రారంభంకానున్న‌ది. 

ఆ కార్య‌క్ర‌మం దాదాపు 10 నిమిషాలు ఉంటుంద‌ని పూజారులు చెప్పారు.  భూమిపూజ కోసం అయోధ్య వ‌స్తున్న ప్ర‌ధాని మోదీ ఆ న‌గ‌రంలో సుమారు 3 గంట‌ల పాటు గ‌డ‌ప‌నున్నారు.  ప్ర‌ధాని మోదీ అయోధ్య‌లో పారిజాత మొక్క‌ను నాట‌నున్నారు. 48 హైటెక్ కెమెరాల‌తో భూమిపూజ ఈవెంట్‌ను లైవ్‌లో ఇవ్వ‌నున్నారు. డీడీ, ఏఎన్ఐ కెమెరాలో దీంట్లో ఉన్నాయి. 

ఇలా ఉండగా, అయోధ్యలో బుధవారం శ్రీరామ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సందర్భంగా భక్తులకు పాట్నాకు చెందిన మహావీర్‌ మందిర్‌ ట్రస్టు 1.25లక్షల ‘రఘుపతి లడ్డూలు’ పంపిణీ చేయనుంది. ఆలయ పునాది వేడుకల సందర్భంగా 51వేల లడ్డూలను రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అప్పగించనున్నారు. మిగతా లడ్డూలను బీహార్‌లోని సీతామార్హి వద్ద ఉన్న జానకీ దేవి ఆలయంతో పాటు సుమారు 25 పుణ్యక్షేత్రాలకు పంపనున్నారు. 

బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆగస్టు 5న శ్రీరామ, హన్మాన్‌ ఆలయాల్లో భక్తులకు లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ‘స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నామని’ ట్రస్టుకు చెందిన ఆచార్య కిశోర్‌ కునాల్‌ తెలిపారు.

ఇప్పటికే మహావీర్‌ మందిర్‌ ట్రస్ట్‌ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఆలయ నిర్మాణానికి ఇప్పటికే రూ.2కోట్లు విరాళం ఇచ్చామని, మరో రూ.10కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయోధ్యలో రామ భక్తుల కోసం ఉచితంగా ‘రామ్ రసోయి’ కూడా నడుపుతున్నట్లు వివరించారు.

అయోధ్యలో నిర్మించబోయే రామ మందిర భూమి పూజకు 175 మంది ప్రముఖ అతిథులను ఆహ్వానించినట్లు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. బీజేపీ సీనియర్‌ నేతలైన ఎల్‌కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, న్యాయవాది కె పరాశరన్, ఇతర ప్రముఖులతో చర్చల అనంతరం ఆహ్వాన జాబితా తయారు చేశామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి అనేక మంది ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన 135 మంది సీర్లతో సహా 175 మంది ప్రముఖ అతిథులు హాజరవుతారని, ఆలయ పట్టణంలోని కొందరు ప్రముఖ పౌరులను కూడా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. 

దివంగత వీహెచ్‌పీ నాయకుడు అశోక్ సింఘాల్ మేనల్లుడు సలీల్ సింఘాల్ ఈ కార్యక్రమానికి “యజ్మాన్” (కర్మ పోషకుడు)గా ఉంటారని, బీహార్‌ జనక్‌పూర్‌కు, ఉత్తర ప్రదేశ్, అయోధ్యలతో సంబంధాలు ఉన్నందున నేపాల్ నుంచి హిందూ దర్శకులను కూడా ఆహ్వానించినట్లు రాయ్‌ తెలిపారు.

ఆలయ రూపకల్పనపై ఆధారపడిన పోస్టల్ స్టాంప్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందని, ప్రధాని ప్రాంగణంలో ‘పారిజాత’ (పగడపు మల్లె) చెట్టును నాటనున్నట్లు రాయ్ వెల్లడించారు. వేడుక మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఆలయ శిలాశాసనం కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, హిందూ ఆచారాల్లో ఎలాంటి రంగు నిషేధించబడదని, దేవతలు ధరించే బట్టల రంగును పూజారులు నిర్ణయిస్తారని రాయ్ తెలిపారు.