కేసీఆర్ కు జ‌గ‌న్ అంటే భయం

అపెక్స్ కమిటీ స‌మావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ మండిప‌డ్డారు.  అపెక్స్ కమిటీ వాయిదా వేయాలని పొరుగున ఉన్న ఏపీ సీఎం కోరాలి గాని తెలంగాణ సీఎం కోరడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. 
 
సచివాలయం కూల్చడానికి సమీక్షల మీద సమీక్షలు నిర్వహించిన సీఎం ఈ విష‌యంలో ఎందుకు పట్టించుకోవడం లేదు?  ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు?  అంటూ సంజయ్ నిలదీశారు. సీఎం కి అంత బిజీ షెడ్యూల్ ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అరగంట మాట్లాడే సమయం లేదా సీఎం కి అంటూ నిలదీశారు. 
 
తెలుగు రాష్ట్రాల మధ్య న‌డుసున్న జ‌లవివాద విష‌య‌మై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారని సంజయ్ గుర్తు చేశారు. ఇద్దరు సీఎంలతో ఆగస్ట్ 5 న సమావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆ కేంద్ర మంత్రి తెలుప‌గా తనకు బిజీ షెడ్యూల్ ఉందని,  అదే మీటింగ్ ఆగ‌ష్ట్ చివ‌రి వారం పెట్టాలని సీఎం కేసీఆర్ అన‌డంలో ఆంత‌ర్యం ఏంట‌ని సంజయ్ ప్ర‌శ్నించారు.
 
ఈ సందర్భంగా కేంద్రంపై కేసీఆర్ చేసిన వాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పై మాట్లాడుతున్న సీఎం ఏపీపై, జగన్ పై ఎందుకు మాట్లాడడం లేదని ప్ర‌శ్నించారు. జగన్ తన బండారం బయట పెడతాడని కేసీర్ భయపడుతున్నాడని ధ్వజమెత్తారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు కలిసి రాష్ట్రాన్ని దోచుకుందామనుకుంటున్నారని, సెంటిమెంటును వాడుకొని లబ్ది పొందాలని చూస్తున్నారని సంజయ్ దుయ్యబట్టారు. బీజేపీ ఇద్దరు సీఎం ల ఆగడాలు అడ్డుకుంటుందని, పక్క రాష్ట్రాల సీఎం లను కలుపుకున్నా భయపడేది లేద‌ని స్పష్టం చేశారు. 
 
బీజేపీ జాతీయ పార్టీ అని, ఏ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం కాద‌ని సంజయ్ తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లో బీజేపీ ముందుంటుందని చెప్పారు. త‌మ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, రిడిజైన్ ల పేరుతో దండుకోవడానికి వ్యతిరేకమ‌ని వెల్లడించారు. సీఎం కేసీఆర్  ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ లకే  పరిమితమని తెలంగాణ ప్రజల‌కు తెలుస‌ని సంజయ్ తెలిపారు.