గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించిన బీజేపీ

మూడు రాజధానుల బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడాన్ని బిజెపి ఏపీ శాఖ గట్టిగా సమర్ధించింది. గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలకు అనుగుణంగా, నిపుణులతో చర్చించి, నిబంధనలకు లోబడి మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బీజేపీ  స్పష్టం చేసింది.

బీజేపీ  రాష్ట్ర శాఖ గత రాత్రి ఒక ప్రకటనలో ‘ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలపైన ఉన్న గౌరవం కారణంగా గవర్నర్‌ నిర్ణయంపైన బీజేపీ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదు. ఇటువంటి ఉత్తమ ప్రమాణాలనే ఇతర పార్టీలు కూడా పాటిస్తాయని బీజేపీ ఆశించింది’ అని తెలిపింది.

అయితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు  రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్‌ను కూడా నిందించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఇది ఆయన అవకాశవాదానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తింది. ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు వ్యవస్థలకు లోబడి ఉంటాయని, అవి అన్ని వేళలా ఒకేలా ఉంటాయని ఈ సందర్భంగా బీజేపీకి గుర్తు చేసింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానివేనని, కేంద్రానికి, గవర్నర్‌కు ఏ అధికారాలు లేవని చెప్పిన సంగతిని రాష్ట్ర ప్రజలింకా మర్చిపోలేదని బీజేపీ స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక సర్వాధికారాలు కేంద్రానికి, గవర్నర్‌కు ఉంటాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని బిజెపి మండిపడింది.

టీడీపీ, మరి కొంత మంది స్వార్ధ, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైఖరిని తప్పుపడుతున్నారని పేర్కొన్నది. గవర్నర్‌ వ్యవస్థ వారికి అనుకూలంగా పనిచేయాలని, రాజధాని బిల్లులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, లేకుంటే రాజ్యాంగ, విభజన చట్టానికి విరుద్ధమని వక్రభాష్యాలు చెప్పి బీజేపీని టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారని మండిపడింది.

మరోవంక, రాజధాని రైతులకు పూర్తిగా న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. తొలి నుండి రాజధాని విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉన్నదని పేర్కొంటూ అమరావతి రాజధానిగా కొనసాగాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిందిని, అక్కడే రాజధానిని కొనసాగించడం సమంజసమన్నది పార్టీ విధానమని వెల్లడించింది. హైకోర్టు సీమలో ఉండాలని ప్రథమంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన్నట్లు గుర్తు చేసింది.

అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో వైసీపీ, తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించినట్టు మార్చడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బిజెపి హెచ్చరించింది. రైతులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ చేసింది రాజకీయ తీర్మానం మాత్రమే. దానిని కేంద్ర ప్రభుత్వ విధానంగా చూసే ఆస్కారం లేదు. ఆ నిర్ణయం తీసుకున్న రోజునే బీజేపీ నాయకులు దీనిపై స్పష్టం చేశారని గుర్తు చేసింది.