క‌రోనా కేసుల్లో ఢిల్లీని దాటిన ఏపీ  

దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీని ఆంధ్ర‌ప్రదేశ్ దాటేసింది. నిన్న‌ ఏపీలో కొత్తగా 10 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం 1,40,933కు చేరాయి. దీంతో గ‌త కొన్ని వారాలుగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌ర్వాత మూడో స్థానంలో కొన‌సాగుతున్న ఢిల్లీని ఏపీ వెన‌క్కి నెట్టివేసింది.

ఢిల్లీలో నిన్న 1,195 క‌రోనా కేసులు న‌మోద‌వ‌డంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,35,598కి చేరింది. ఏపీలో కేవలం మూడు రోజుల్లోనే 30,636 పైగాపాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం కేసులు 1.4 ల‌క్ష‌లు దాటాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ పాజిటివిటీ రేటు 7.22 శాతానికి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 1349 మంది మ‌ర‌ణించారు. ఏపీలో నిన్న‌టివ‌ర‌కు మొత్తం 19,51,776 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అత్య‌ధిక కేసుల‌తో మ‌హారాష్ట అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. శుక్ర‌వారం వ‌ర‌కు రాష్ట్రంలో 4,11,798 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. 2,39,978 క‌రోనా కేసుల‌తో త‌మిళ‌నాడు రెండో స్థానంలో ఉన్న‌ది.

కాగా, ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి రూ.5000 ఇవ్వాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  నిర్ణయించారు. కొవిడ్‌ బాధితుల్ని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ముఖ్యమని, కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా దా నానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.