ఎన్నికల కమిషనర్‌గా మరోసారి నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మరోసారి నియమిస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత  అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. 

ఈ మేరకు గవర్నర్‌ పేరిట పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నోటిఫికేషన్‌  జారీ చేశారు. సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ తుది తీర్పునకు లోబడి నోటిఫికేషన్‌  ఉంటుందని స్పష్టం చేశారు. 

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో కోవిడ్‌ 19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను ఆరు వారల పాటు గత మార్చ్ లో వాయిదా వేయసారు. దానితో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్డినెన్సు ద్వారా ఎన్నికల కమీషన్ స్వరూపాన్నే మార్చివేసి, జస్టిస్ కనకరాజ్ ను ఆ పదవిలో నియమించారు. 

దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆర్డినెన్సు చెల్లనేరదని మే 29న హై కోర్ట్ తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించక పోవడంతో ఆయన హైకోర్టు లో కోర్ట్ ధిక్కరణ అభియోగం చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ను మూడుసార్లు ఆశ్రయించినా చుక్కెదురైనది.

హైకోర్టు ఆదేశంపై నిమ్మగడ్డ గవర్నర్ ను కలిశారు. వెంటనే హైకోర్టు ఆదేశాన్ని  పరచమని గవర్నర్ సూచించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో సుప్రీంకోర్టు గత శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వారం శుక్రవారంలోగా హైకోర్టు ఉత్తరువు అమలు పరచాలని స్పష్టం చేసింది.

దానితో ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు ఈ అంశం వచ్చే అవకాశం ఉన్నందున గత అర్ధరాత్రి హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను తిరిగి నియమిస్తూ ఉత్తరువులు జారీచేసిన్నట్లు కనిపిస్తున్నది.