మలేషియా మాజీ ప్రధానికి 12 ఏండ్ల జైలు

మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు కౌలాలంపూర్ హైకోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఈ శిక్ష విధించారు. అంతేకాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను 210 మిలియన్ రింగిట్స్ (49 మిలియన్ డాలర్ల) జరిమానా కూడా విధించారు. 

ఆయన తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎక్కువ మొత్తాన్ని గల్ఫ్ రాష్ట్రాలు, హాలీవుడ్ కు తరలించారని తేలింది. నేరపూరిత కార్యకలాపాలు మరియు మనీలాండరింగ్ ఆరోపణలపై కోర్టు ఆయనకు మరో 20 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అన్నింటికి కలిపి ఆయన 12 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తే సరిపోతుందని కోర్టు తెలిపింది.

కాగా నజీబ్ మాత్రం నేరాన్ని అంగీకరించలేదు. ఈ కేసు గురించి ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని ఆయన తెలిపారు. ‘ఈ కేసు విచారణకు సంబంధించి అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాత నజీబ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిరూపితమైంది’ అని న్యాయమూర్తి మొహమ్మద్ నజ్లాన్ స్పష్టం చేశారు. జైలు శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

అయితే నజీబ్ తరపు లాయర్లు న్యాయమూర్తికి ఒక అభ్యర్థన చేశారు. జైలు శిక్ష, జరిమానాల అమలుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. దానికి అంగీకరించిన న్యాయమూర్తి నజీబ్ అదనపు బెయిల్ తీసుకొని నెలకు రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేయాలని తెలిపారు.