ఇష్టానుసారంగా మీడియాపై ఆంక్షలు సరికాదు 

ప్రభుత్వం ఏవైనా అంక్షలు పెట్టాలనుకుంటే చట్ట ప్రకారం ఉత్తరువులు జారీ చేయాలి గాని ఇష్టానుసారంగా చెయ్యడం, అంక్షలు పెట్టడం సరైంది కాదని కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు సున్నితంగా చివాట్లు పెట్టింది.

రాష్ట్ర సచివాలయం కూల్చివేత ఫొటోలు ఫోటోలు తీయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై దాఖలైన పిటిషన్ విచార సందర్భంగా మీడియా హక్కులు, వాటి పరిధుల గురించి విస్థృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. 

సచివాలయం కూల్చివేత పనులు మీడియాకు చూపించడానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలుప‌గా ప్ర‌భుత్వం దిగి రావడం , పోరపాటును సరిదిద్దు కోవడం మంచి పరిణామం అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఓపెన్ కోర్టులో విస్తృతంగా చర్చ జరిపి గైడ్ లైన్స్ తీసుకురావాలని కోర్టు అభిప్రాయ ప‌డింది. చట్టం ప్రకారం, లా ప్రకారం కాకుండా మీడియాను నియంత్రిస్తే అర్టికల్ 19 ఉల్లంఘించినట్టేన‌ని కోర్టు భావిస్తోంద‌ని స్పష్టం చేసింది. 

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాను విధించిన నియంత్రణలు భారత రాజ్యంగం లోని అర్టికల్ 19 లోబడే ఉన్నాయని ప్రభుత్వం నిరుపించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. కోర్టు పేర్కొన్న అంశాలతో కౌంటర్ దాఖలు చెయ్యాల్సిందిగా అడ్వకేట్ జనరల్ ను న్యాయ‌స్థానం అదేశించింది.