ఏపీలో కరోనా కట్టడికి అన్ని కొరతలే 

కరోనా కట్టడి గురించి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. వైద్యుల నుండి వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు,పడకలు … అన్నింటికి కొరతే! ఇక రోగులకు అందించే భోజనంపైన కూడా ఫిర్యాదులు అందుతున్నాయి.
 
రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల కొరత వెంటాడుతోంది. విజయవాడలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా ఉంది. ఇక్కడ 650 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం 440కుపైగా చికిత్స పొందుతున్నారు.  80 వెంటిలేటర్లు ఉన్నా, వెంటిలేటర్‌పై చికిత్స అందించేందుకు స్పెషలిస్టు వైద్యులు లేరు. ప్రస్తుతం ఇద్దరు పల్మనాలజిస్టులు మాత్రమే ఉన్నారు. 
 
వీరుగాకుండా ఇతర వైద్య సిబ్బంది అత్యవసరంగా 160 మందికి పైగా కావాలి. కర్నూలు, విశాఖ నెల్లూరు, విజయనగరం, ప్రకాశం ఇలా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ వైద్య శాలల్లో వైద్యుల కొరత ఉండటంతో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
గుంటూరు జిల్లాలో వైద్యుల నియామకాల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చినా స్పందన కనిపించలేదు. జూనియర్‌ వైద్యులు 20 మంది కరోనా బారిన పడ్డారు. నర్సులు ఇతర సిబ్బంది కనీసం 300 మంది అవసరమని అంచనా. దాదాపుగా అన్ని ఆస్పత్రుల్లోనూ నర్సింగ్‌తో పాటు ఇతర సిబ్బంది కొరత ఉంది. 
 
కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నవారికి వెంటిలేటర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉండగా వీటి సంఖ్య పరిమితంగా ఉండటం సమస్యగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు కోవిడ్‌ ఆస్ప త్రుల్లో కలిపి 10,500 పడకలు ఉండగా, వందకుమించి వెంటిలేటర్లు లేవు. దీంతో, అత్యవసర రోగులను విశాఖకు తరలిస్తున్నారు. 
 
విశాఖలో రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించిన విమ్స్‌లో 140 వెంటిలేటర్లు ఉన్నా యి. కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వెంటిలేటర్‌ అవసరమైన రోగులను ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలిస్తున్నారు. 
 
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా తగినంత సంఖ్యలో వెంటిలేటర్సు లేవు. ఈ జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉన్న ఆస్పత్రుల్లోనూ వెంటిలేటర్ల కొరత ఉంది. కర్నూలు జిల్లాలోనూ చాలినంతగా లేకపోవడంతో 1,841 పడకలకు వెంటిలేటర్లు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు రూపొం దించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా అనేక అస్పత్రుల్లో ఆక్సిజన్‌ కిట్ల కొరత కూడా వెంటాడుతోంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో మందుల కొరత ఉండడంతో రోగుల బంధువులతోనే మందులను కొనిపిస్తున్నారు . రాష్ట్ర స్థాయి  క్వారంటైన్‌ కేంద్రంగా ఉన్న స్విమ్స్‌లో ఆక్సిజన్‌, డాక్టర్లు, నర్సులు కొరత ఉంది.