రాజ్యాంగ సంక్షోభం వైపు అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం

రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్‌‌ కల్‌రాజ్‌ మిశ్రాతో శనివారం రాత్రి బీజేపీ ప్రతినిధివర్గం భేటీ అయింది. గవర్నర్‌‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ‌ సతీశ్‌ పూనియా ధ్వజమెత్తారు.

“అసెంబ్లీ నిర్వహించాలంటే ఒక పద్ధితి ఉంటుంది. దాన్ని ఫాలో అవకుండా కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. ముందు కరోనా మీద ఫోకస్‌ చేయండి” అని బీజేపీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంతిరువర్గానికి అడిగే హక్కు ఉందని, దానికి సరైన కారణం  చెప్పాలని వారు స్పష్టం చేశారు. 

కానీ కాంగ్రెస్‌ ఆ కారణం చెప్పడం లేదని బీజేపీ నేతలు గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలు‌ నిర్వహించాలని అడిగే పద్ధితి ఇది కాదని, గొడవలు ధర్నాలు చేయకూడదని బీజేపీ నేత కటారియా దయ్యబట్టారు. ఈ రకంగా చేస్తే అసెంబ్లీలో సీఆర్‌‌పీఎఫ్‌ పోలీసులతో సెక్యూరిటీ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

హైకోర్టులో సచిన్‌పైలెట్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో గెహ్లాట్‌, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశం‌ నిర్వహించాలని గవర్నర్‌‌ను కాంగ్రెస్ ఎమ్యెల్యేలు డిమాండ్‌ చేశారు. వాళ్లంతా రాజ్‌భవన్‌కు వెళ్లి లాన్‌లో ధర్నా చేశారు. దీంతో వారిపై బీజేపీ ఈ ఆరోపణలు చేసింది.  

ఇలా ఉండగా, సచిన్‌ పైలెట్ తో సహా 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్య తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ స్పీకర్‌‌ సి.పి. జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.  ముగ్గురు జడ్జిల బెంచ్‌ సోమవారం దాన్ని విచారించనున్నది.