విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌లు

భారత్ లో కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. దేశీయ విమాన గరిష్ట  ఛార్జీలపై గతంలో విధించిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

మే 21న నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 24 వరకు టికెట్ల ధరలపై నియంత్రణ ఉన్నది. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోవటంతో నియంత్రణను పొడిగించినట్టు శుక్రవారం విడుదలచేసిన ప్రకటనలో విమానయానశాఖ వెల్లడించింది.

వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. దేశీయ విమాన సర్వీసులను దాదాపు రెండు నెలల విరామం తర్వాత మే 25నుంచి ప్రారంభించగా,  ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలను డీజీసీఏ నిర్ణయించింది.

కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ నెల ప్రారంభంలో మాట్లాడుతూ దీపావళి నాటికి ప్రయాణించే దేశీయ విమానాల సంఖ్య 55 నుండి 60 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

దేశీయ విమానయాన పరిశ్రమ వివిధ రంగాలకు ఛార్జీల పరిమితితో, పరిమిత సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.