కరోనా కట్టడిలో ఆదర్శంగా దేశ రాజధాని ఢిల్లీ 

దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీ కరోనా కట్టడిలో భేష్‌ అని పించుకుంది. ఒకప్పుడు రోజుకు వేల కేసులు నమోదు కాగా ప్రస్తుత్తం ఆ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్న కఠిన చర్యల వల్లే ఇది సాధ్యమైంది. 

మే, జూన్‌ నెలల్లో ఢిల్లీని కరోనా వణికించింది. వేల సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి. అయితే గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టెస్టుల సామర్థ్యం పెంచడం, హాస్పిటల్స్‌లో పడకల పెంపు, ఐసోలాషన్, ఆక్సీమిటర్ల పంపిణీ, ప్లాస్మాథెరపీ, ఇంటింటి సర్వే, స్క్రీనింగ్‌పై దృష్టి సారించింది.

‘కరోనా హారేగా ఆర్ ఢిల్లీ జితేగా’ అనే నినాదంతో ప్రభుత్వం ప్రజల్లో ధైర్యం నింపింది. పలు రాష్ట్రాల సీఎంలు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రానప్పటికీ కేజ్రీవాల్‌ కేంద్రంతో కలిసి సమీక్షలు నిర్వహించి కరోనాపై విజయం సాధించ గలిగారు. కేరళ తర్వాత కరోనాను సమర్థంగా కట్టడి చేస్తుంది ఢిల్లీనే. 

గతంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి జులై నెలాఖరుకి ఐదు లక్షల కేసులు వస్తాయని ప్రకటించారు, సర్వేలు కూడా ఐదు లక్షల కేసులు దాటుతాయని హెచ్చరించాయి. అయితే వాటిని అన్నిటినీ అదిగంమించి జులై ఇరవై నాటికి 1.5 లక్షల్లో నే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. 

ఈనెల 20 న అతి తక్కువగా 954 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య 86 శాతానికి చేరింది. ఢిల్లీలో ఒకప్పుడు ఐదువేల టెస్టులు కూడా చేయలేని దుస్థితి ఉంది.. ఎందుకంటే ప్రజల్లో కరోనా కంటే క్వారంటైన్ అంటేనే విపరీతమైన భయం ఉండేది. 

ఇది గమనించిన ప్రభుత్వం ప్రజల్లో భయాలను తొలగించెందుకు చేసిన అనేక ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యాయి. కరోనా వైద్యం, ఆసుపత్రులో పడకల , వెంటిలేటర్ లు నిర్వహణ వివరాలు యాప్‌ ద్వారా ప్రజల ముందుకు తీసుకవచ్చారు. స్వల్ప లక్షణాలు ఉన్నా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందించారు. ప్రస్తుతం రోజుకి ఇరవై వేల టెస్టులు నిర్వహిస్తున్నారు. 

అంతే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్చంధంగా టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 1,28,389 కరోనా కేసులు ఉన్నాయి ఇప్పటివరకు 1,10,931 మంది కరోనా నుంచి కోలుకున్నారు, చనిపోయిన వారు 3,777, యాక్టివ్ కేసులు 13,681. శుక్రవారం నాడు 1,025 కేసులు కొత్తగా నమోదయ్యాయి, 32 మంది చనిపోయారు.

ఢిల్లీలో అనుమానితులకు, లక్షణాలు ఉన్న వారికి కూడా విస్తృతంగా పరీక్షలు చేశారు. లక్షణాలు ఉండటంతో సీఎంకు కూడా పరీక్షలు నిర్వహించారు. మంత్రులకు కరెనా సోకినప్పటికీ ఎవరూ భయపడలేదు. ప్రతి రోజు మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చి వారికి ధైర్యం చెప్పారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి భరోసా కల్పించి, సమర్థంగా పనిచేసేలా ప్రోత్సహించారు.

దేశంలోనే మొట్టమొదటి ప్లాస్మా థెరపీ బ్యాంక్‌ను ప్రారంభించారు. అది చాలా మంది అద్భుత ఫలితాలు సాధించాయి. చాలా మంది స్వచ్చంధంగా ప్లాస్తాను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.