నిమ్మగడ్డ విషయంలో జగన్ కు మరోసారి జలక్ 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టకుండా అడుగడుగునా అడ్డుకొంటున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్  రెడ్డికి ఇప్పుడు అన్ని దార్లు  మూసుకు పోయాయా? 

వచ్చే శుక్రవారం లోగా రాష్ట్ర హై కోర్ట్  విషయమై ఇచ్చిన ఆదేశాన్ని అమలు పరచమని సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఇరకాటంలో పడినట్లయింది. 

హైకోర్టు తీర్పును అమలు పరచక పోవడంతో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్ట్ ధిక్కరణ పిటిషన్ ను ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్ట్ ముందున్నందున చేపట్టకుండా స్టే ఇవ్వమని సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. 

హైకోర్టు ఆదేశాన్ని అమలు పరచమని ఆదేశిస్తూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చినది అంటూ ఆగ్రహం  వ్యక్తం చేసింది. గవర్నర్ ఆదేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచక పోవడం పట్ల సుప్రీం కోర్ట్ విస్మయం వ్యక్తం చేస్తూ గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని జగన్ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.