ఏపీలో మరో 54 ఆస్పత్రులు, రూ 10,000 కోట్ల నిధులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 
రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్‌ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్‌ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తద్వారా క్రిటికల్‌కేర్‌ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్‌ కేర్‌ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులుగా మార్చామన్నారు.
వచ్చే ఆరు నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పారామెడికల్‌ సిబ్బంది, వైద్యుల నియామకం, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. 

ఇవికాకుండా కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 72,711కి చేరింది. అందుులో 884 మంది మరణించగా, 37555 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 34,272 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.