జగన్ మంత్రి వర్గంలో మరో ఇద్దరు 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర మంత్రివర్గాన్ని ఇవాళ విస్తరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజులను మంత్రులుగా రాష్ట్ర  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు.  
 
కరోనా వ్యాప్తి దృష్ట్యా అతి కొద్ది మందితోనే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, సభాపతి తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌, మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు.
పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లకే సీదిరికి మంత్రి పదవి వరించింది. 1995లో పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నారు.

తూర్పుగోదావరి రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవిపాలెంలో జన్మించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తొలిసారి కాకినాడ గ్రామీణంలో ఓడిపోయినా, 2019లో రామచంద్రపురం నుంచి గెలిచి ఇప్పుడు మంత్రి పదవి చేపడుతున్నారు. 2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి తొలి రాజకీయ విజయం అందుకున్నారు. 2006లో మలికిపురం జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడయ్యారు. 

 
2008 నుంచి 2012 వరకు డీసీసీ అధ్యక్షునిగా, ఉమ్మడి రాష్ట్రంలో పీసీబీ సభ్యునిగా పనిచేశారు. 2013లో వైసిపిలో చేరి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికయ్యారు. 2014లో అక్కడే వైసిపి తరఫున పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. 
 
2016 నుంచి 2018 వరకు వైసిపి జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. పార్టీ అధినేత ఆదేశాలతో 2019లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులుపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ బాక్సింగ్‌ సంఘ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు.