చైనా ఎంబసీ ముందు ఇండో అమెరికన్ల నిరసన

దేశ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా సైనికుల దూకుడుకు వ్యతిరేకంగా భారత సంతతికి చెందిన అమెరికన్లు  వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ‘చైనా కమ్యూనిస్ట్‌: డౌన్‌డౌన్‌’ అని చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు డ్రాగన్‌ వ్యతిరేక బ్యానర్లు ప్రదర్శించారు. 

మేరీల్యాండ్‌, వర్జీనియా, వాషింగ్టన్‌ డీసీ రాష్ర్టాల్లోని భారత్‌-అమెరికా సాంస్కృతిక, సాంఘిక సంస్థలు, కేరళ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ వాషింగ్టన్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏషియన్‌ ఇండియన్‌ అసోసియేషన్లు, దుర్గా టెంపుల్‌ ఫ్రెండ్స్‌, హొవార్డ్‌ కౌంటీలోని తమిళ, భారత్‌ సాంస్కృతిక సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.

సామాజిక కార్యకర్త మనోజ్‌ శ్రీనిలయం మాట్లాడుతూ ‘లఢక్‌లో చైనా సైన్యం నిష్కారణంగా దూకుడు ప్రదర్శించి, భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని, కొవిడ్‌ మహమ్మారి గురించి ప్రపంచాన్ని డ్రాగన్‌ తప్పుదోవ పట్టించడాన్ని ఖండిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. మరో కార్యకర్త మహీంద్ర సపా మాట్లాడుతూ.. భారత్‌, ఇతర చిన్న దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.