శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు మృతి 

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం కన్నుమూశారు. ఆయన వేకువజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా వైరస్‌ సోకడంతో గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఆయన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా సేవలు అందిచారు.పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు గత ఏడాది పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉ​న్నారు. 
 
తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.  
 
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.   
 
ఇలా ఉండగా,  కరోనా బారిన పడిన శ్రీవారి ఆలయ అర్చకులు కోలుకుంటున్నారు. ఈ నెల 8న నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు అర్చకులు కోలుకోవడంతో వైద్యులు వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అర్చకులకు వైద్యులు సూచించారు. 
 
దీంతో  కోవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న అర్చకుల సంఖ్య 14కు చేరుకుంది. చెన్నై అపోలో ఆస్పత్రిలో మరో అర్చకుడు చికిత్స పొందుతున్నారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్సను అందజేస్తున్నారు. అర్చకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.