ఇకపై వినియోగదారులే రాజులు

భారతప్రభుత్వం ఇకపై నూతన వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తేనుంది. సోమవారం నుంచి ఈ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులకు తాము కొనే, పొందే వస్తువులు, సేవలకు పూర్తి హక్కులు ఉంటాయి. వారికి రక్షణ కల్పించే విధంగా వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019ని రూపొందించారు.

కొత్త చట్టం అమలులోకి వస్తే వినియోగదారులే రాజులు అవుతారు. వినియోగదారులు ఇకపై తాము కొనే వస్తువులకు సంబంధించిన ప్రాంతంలో కాకుండా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వినియోగదారుల ఫోరంలో కేసులు వేసి ఆ మేరకు పరిహారం పొందవచ్చు.

ఇక వినియోగదారులు వారు కొనే వస్తువుల వల్ల వారికి నష్టం కలిగితే ఆ వస్తువులను తయారు చేసిన కంపెనీ లేదా డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ లేదా అమ్మకం దారులకు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది.1 లక్ష ఫైన్ వేస్తారు.

అయితే వినియోగదారులకు తాము కొనే వస్తువుల వల్ల గాయాలైతే తయారీదారు, అమ్మకందారు, డిస్ట్రిబ్యూటర్‌లకు గరిష్టంగా రూ.5 లక్షల జరిమానా  విధిస్తారు. లేదా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇక ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు చనిపోతే గరిష్టంగా రూ.10 లక్షల జరిమానాతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

తీవ్రత ఎక్కువ ఉంటే యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధిస్తారు. నూతనంగా అమలు చేయనున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ఈ శిక్షలు, జరిమానాలు ఉంటాయి. వినియోగదారులు తాము కొనే వస్తువులు నకిలీవని తేలినా, వాటిలో కల్తీ అని గుర్తించినా.. డ్యామేజ్ అయినా.. ఇతర ఏ కారణాల వల్ల అయినా నష్టం కలిగితే అందుకు పరిహారం పొందవచ్చు.

ఇక ఒకే సారి ఎక్కువ మంది వినియోగదారులకు నష్టం వాటిల్లితే దాన్ని సుమోటోగా తీసుకుని జాతీయ వినియోగదారుల ఫోరం కేసు విచారించి,  బాధితులకు రక్షణ, పరిహారం అందిస్తుంది. ఈ చట్టం వినియోగదారులకు ప్రధానంగా ఆరు హక్కులను అందిస్తుంది:

1. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకు గాను వారికి పూర్తి స్థాయిలో రక్షణ హక్కు లభిస్తుంది.

2. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకు సంబంధించి క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్‌, ధరలను తెలుసుకునే హక్కు ఉంటుంది.

3. అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే, అన్ని రకాల సేవలను పొందే హక్కు, వాటిని ఎంపిక చేసుకునే హక్కులు వినియోగదారులకు ఉంటాయి.

4. వినియోగదారులు తమ ఫిర్యాదులను సంబంధిత ఫోరంలలో నమోదు చేసే హక్కు ఉంటుంది.

5. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవల వల్ల నష్టం వాటిల్లితే అందుకు పరిహారం పొందే హక్కు ఉంటుంది.

6. వినియోగదారులు తాము కొనే వస్తువులు, పొందే సేవలపై నష్టపోకుండా ఉండేందుకు వారు వివరాలను తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది.