చైనా సైన్యంతో సంబంధమున్న కంపెనీలపై గురి 

చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో సంబంధాలు ఉన్న 7 చైనా కంపెనీలపై చర్యలకు తీసుకునేందుకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ జాబితాలో హువావెయి, అలీబాబా వంటి గ్లోబల్ జెయింట్ కంపెనీలు ఉన్నాయి.  తమ దేశానికి చెందిన కంపెనీల ద్వారా భారత్‌పై డ్రాగన్‌ నిఘా వేసినట్లు వెల్లాడి కావడంతో భారత ప్రభుత్వం చైనా కంపెనీలపై కన్ను వేసింది.
హువావేతోపాటు సీఈటీసీ, జిందియా స్టీల్స్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. భారత్‌లో ఇవి నిఘా చర్యలకు పాల్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇప్పటికే.. దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయనే కారణంతో ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లపై కేంద్రం ఇటీవలే నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
2017 జూన్‌లో చైనా  రూపొందించిన ఇంటెలిజెన్స్‌ చట్టం  ప్రకారం హువావే, జెట్‌టీఈ, టిక్‌టాక్‌ వంటి కంపెనీలు తాము పనిచేస్తున్న దేశాల్లో చైనా జాతీయ నిఘా సంస్థలకు సహకారం, మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
చైనీస్ టెలికాం కంపెనీ హువావెయి 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో రూ.12,800 కోట్లు  సంపాదించింది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ ఝెంగ్‌ఫెయి గతంలో పీఎల్ఏ ఇంజినీరింగ్ కార్ప్స్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ కంపెనీపై బ్రిటన్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో వివాదాలు నడుస్తున్నాయి.
పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, స్నాప్‌డీల్, ఎక్స్‌ప్రెస్‌‌బీస్, ఓలా క్యాబ్స్, ఫ్లిప్‌కార్ట్‌లలో అలీబాబా పెట్టుబడులు ఉన్నాయి. పీఎల్ఏతో సంబంధాలున్న చైనా కంపెనీలు మన దేశంలో అనేక రంగాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, ఉక్కు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉన్న ఈ కంపెనీలు పీఎల్ఏకు సైనిక గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గాల్వన్ లోయలో జూన్ 15న భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేయడంతో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఆ వివరాలను చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ జూన్‌లో 59 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.