భారత్, నేపాల్ వరదల్లో 189 మంది మృతి 

భార‌త్ ఈశాన్య రాష్ట్రం అసోంలో,  అదేవిధంగా పొరుగున ఉన్న నేపాల్‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల వ‌ల్ల దాదాపు 40 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. 189 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు నేడు వెల్ల‌డించారు. డ‌జ‌న్ల కొంది మంది ఆచూకీ గ‌ల్లంతు అయిన‌ట్లు తెలిపారు.
టిబెట్, భారత్‌, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నది వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌స్థాయిల‌ను దాటి ఉప్పొంగ‌టంతో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. పొలాలు బుర‌ద‌మ‌య‌మ‌య్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 
 
అస్సాంలో మే నెల‌ చివరివారం నుండి మూడు ద‌ఫాలుగా సంభ‌వించిన వ‌ర‌ద‌ల్లో 27.5 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు, రాత్రి సంభ‌వించిన‌ మరో రెండు మరణాలు క‌లుపుకుని మొత్తం 79 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.
 ప్రమాదకరస్థాయిల‌ను మించి చాలా నదులు ప్రవహించడంతో వరద పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని అసోం జ‌ల వనరులశాఖ మంత్రి కేషాబ్ మహంత అన్నారు. ఒకవైపు వరదలు మ‌రోవైపు కరోనా వైరస్ మహమ్మారి అసోం జంట సవాళ్ల‌ను ఎదుర్కొంటుంద‌న్నారు.
పొరుగున ఉన్న నేపాల్‌లో ఆదివారం నుండి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం అంచ‌నా నేప‌థ్యంలో దక్షిణ మైదానాల్లోని నివాసితులను అప్రమత్తంగా ఉండాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం కోరింది. అక‌స్మాత్తుగా సంభ‌వించిన వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వ‌ల్ల 110 మంది చ‌నిపోయిన‌ట్లు మ‌రో 100 మంది గాయ‌ప‌డ్డ‌ట్లు తెలిపారు.
 దేశంలోని 77 జిల్లాలో 26 జిల్లాలో వంద‌లాది మంది నిరాశ్ర‌యులైన‌ట్లు తెలిపారు. 48 మంది క‌నిపించ‌కుండా పోయినట్లు వెల్ల‌డించారు. రానున్న నాలుగు రోజులు నేపాల్‌కు భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న‌ట్లు అక్క‌డి వాతావ‌ర‌ణశాఖ అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా, దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో ఈ ఉద‌యం భారీ వ‌ర్షాలు కురిశాయి. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప‌లు ప్రధాన రోడ్లపై భారీఎత్తున నీరు నిలిచిపోయింది. ఏక‌ధాటిగా కురిసిన వ‌ర్షానికి ఐటిఓ ప్రాంతంలోని ఓ మురికివాడ వద్ద ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింది. వ‌ర‌ద నీటి ప్ర‌వాహానికి మురికి కాలువ ఉప్పొంగి ప్ర‌హ‌హించింది.
పొంగిపొర్లుతున్న మురుగునీటి కాలువ ప్ర‌వాహా ప్ర‌భావానికి ఓ ఇళ్లు క్ష‌ణ‌కాలంలో కూలిపోయి వ‌ర‌ద నీటిలో క‌లిసిపోయింది. ఘ‌ట‌న స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం తప్పింది. సంఘ‌ట‌నా స్థ‌లానికి క్యాట్స్, ఫైర్ ఇంజన్లు చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించాయి. మ‌రొక ఘ‌ట‌న‌లో అదే ప్రాంతంలో మురుగుకాల్వ అంచున ఉన్న ఓ ఇటుక‌ల ఇళ్లు కూలిపోయి శిథిలాలుగా మిగిలింది.
ఐకానిక్ మింటో వంతెన కింద రహదారి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. మరణించిన వ్యక్తిని చండీగఢ్‌కు చెందిన కుందన్‌ (56)గా గుర్తించారు. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వానలు కురిసినట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.