కాంగ్రెస్ అంతర్గత కలహాలతో బిజెపిని లాగుతారే

రాజస్థాన్ లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అంతర్గత కలహాల కారణంగా  గొడవలు తలెత్తాయని,  బీజేపీని మధ్యలోకి లాగడం అస్సలు భావ్యం కాదని రాష్ట్రంలో  ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై స్పందిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే స్పష్టం చేశారు. 

‘‘కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలకు ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇది దురదృష్టకరం’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.  తమకు రాజస్థాన్‌ ప్రజలే ముఖ్యం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆమె సూచించారు.

కోవిడ్ కారణంగా 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఈ రాజకీయ సంక్షోభం జరుగుతోందని, పాజిటివ్ కేసులు 28,000 పైగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా మిడతలు దాడి చేస్తున్న తరుణంలో, మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో ఈ సంక్షోభం సంభవించిందని పేర్కొన్నారు. 

ఇది ప్రజల గురించి ఆలోచించాల్సిన సమయమని, ఈ బురదలోకి బీజేపీని, బీజేపీ నాయకులను ఈడ్చడంలో అర్థం లేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ప్రజల అవసరాలే పరమావధిగా ఉండాలని వసుంధర రాజే కాంగ్రెస్‌కు సూచించారు.

“రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజలు జీవితాల కోల్పోతున్నారు. మిడతల దండు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ సమస్య‌ పెరిగిపోయింది. ప్రజలు పడుతున్న కొన్ని సమస్యలను మాత్రమే ఇక్కడ చెప్పగలుగుతున్నాను” అంటూ ఆమె పేర్కొన్నారు.