రాజస్థాన్ లో ఫోన్ ట్యాప్ చేస్తున్న కాంగ్రెస్ 

రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్‌ ట్యాప్‌ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆ  పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

“ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్‌ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సమాధానం చెప్పాలి” అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి సంబంధించి ఫోన్‌ సంభాషణల రికార్డింగ్స్‌ తమ దగ్గర ఉన్నాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అనవసరంగా బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. “మేం నైతికతతో వ్యవహరిస్తున్నాం.  రాజ్యాంగం ప్రకారం పనిచేస్తునాం. అందుకే సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాం” అని సంబిత్‌ పాత్ర చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. 

1. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందో లేదో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. 2. ఒక వేళ జరిగి ఉంటే అది సెన్సిటివ్‌, లీగల్‌ అంశం కాదా? 3. ఒక వేళ మీరు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఉంటే ఎస్‌వోపీ ఫాలో అయ్యారా? 4. తమను తాము కాపాడుకునేందుకు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ రాజ్యాంగ విరుద్ధ మార్గాలను ఉపయోగించారా? 5. ఇంకా ఏ రాజకీయ నాయకుల ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారా? అని ట్విట్టర్‌‌ వేదికగా ప్రశ్నలు అడిగారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించిన కాంగ్రెస్‌ కేంద్ర మంత్రి షకావత్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసింది. వాళ్ల ఫోన్‌ సంభాషణకు సంబంధించి ఆడియో టేప్‌లను కూడా రిలీజ్‌ చేసింది.