తిరువనంతపురం తీర ప్రాంతాల్లో  సామాజిక వ్యాప్తి   

రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. పుంథురా, పులివిల్లా ప్రాంతాల్లో పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పారు. అయితే.. దేశంలో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ఇప్పటివరకూ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. 

పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరిశీలించగా, 51 మందికి, పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో తిరువనంతపురంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.  రాజధానిలో శుక్రవారం 246 కేసులు నమోదు కాగా వాటిలో 240 కేసులు స్థానికంగానే వ్యాప్తి చెందాయని పేర్కొన్నారు.

శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వారిలో 532 మందికి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. 42 మందికి వైరస్‌ ఎక్కడి నుంచి వైరస్‌ సోకిందో అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ఈ విషయాన్ని వెల్లడించిన పినరయి విజయన్, తిరువనంతపురంలో కరోనా కట్టడిలో భాగంగా జూలై నెల 6 నుంచి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.  దీంతో మరో లాక్‌ డౌన్‌ ఉంటుందని విజయన్‌ ప్రకటించారు. మొత్తం తీర ప్రాంతాన్ని మూడు జోన్లగా విభజించి  పూర్తి లాక్ డౌన్ విధిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు శనివారం ప్రకటిస్తామని తెలిపారు. క్లస్టర్‌ ప్రాంతాల్లో మాత్రమే లాక్‌డౌన్‌ విధిస్తున్నామని, రాష్ట్రమంతా పూర్తి లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరంలేదని విజయన్‌ స్పష్టం చేశారు. ఈ మూడు జోన్‌లలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.