యుపిలో కరోనా కట్టడికి లక్ష బృందాలు 

కరోనా పరిస్థితిపై సమర్ధవంతమైన నిఘా కోసం రాష్ట్రంలో లక్ష బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. “సమర్థవంతమైన నిఘా కోసం, మొత్తం రాష్ట్రంలో లక్ష బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ప్రతి జిల్లాను ఈ బృందం పర్యవేక్షించనుండగా స్థానిక కలెక్టర్లు నాయకత్వం వహించాల్సి ఉంటుంది.’’ అని ఉత్తరప్రదేశ్ సీఎంఓ నుంచి ట్వీట్ చేశారు.

‘‘ప్రస్తుతం వర్షం కారణంగా గాలిలో తేమ పెరిగిందని, దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ పెరుగుతోందని కేజీఎంయూ పల్మనరీ, క్రిటికల్ కేర్ విభాగం వైద్యుడు వేద్ ప్రకాశ్‌ ముఖ్యమంత్రికి తెలియజేశారు.”అని యూపీ సీఎంఓ మరో ట్వీట్‌ చేసింది.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించడం అవసరమని డా. ప్రకాష్ స్పష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో శానిటైజేషన్‌ చేస్తుండాలని ఆయన  సూచించారు. కరోనా రోగుల్లో 80 శాతం మంది లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారని డాక్టర్ ప్రకాశ్‌ తెలిపారు. 15 శాతం మంది రోగులు తక్కువ లక్షణాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. 5 శాతం రోగులు మాత్రమే తీవ్ర, క్లిష్టమైన లక్షణాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. 

యుపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ అడ్రస్ సిస్టమ్ ద్వారా, సామాజిక దూరం, మాస్కు, పరిశుభ్రత వంటి సలహాలను ప్రజలకు నిరంతరం తెలియజేస్తుండాలని అధికారులకు సూచించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 1,046 మంది కరోనాతో మృతి చెందగా.. 43,441 కరోనా కేసులు నమోదయ్యాయి.