తేలికపాటి ట్యాంకుల అత్యవసర సేకరణ 

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తేలికపాటి ట్యాంకుల అత్యవసర సేకరణకు కేంద్ర ప్రభుత్వం  ఆమోదం తెలిపింది. ఈ ట్యాంకులను అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులో తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంట కొత్త టైప్-15 తేలికపాటి ట్యాంకులను చైనా మోహరించడం భారత్ కు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. 

ఈ క్రమంలో సైన్యం అమ్ములపొదిలో అలాంటి రకం యుద్ధ ట్యాంకులను వీలైనంత త్వరగా చేర్చేందుకు భారత్ సిద్దమైంది. లడఖ్‌ ప్రాంతంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులు వచ్చినపక్షంలో అవి భారత సైన్యానికి పెద్ద ఊపునిస్తాయి. అవి ప్రధాన యుద్ధ ట్యాంకులతో పోలిస్తే మరింత చురుకైనవి.

భవిష్యత్తులో చైనా మనపై దాడి చేసేందుకు యత్నించిన పక్షంలో అడ్డుకోవడానికి ఎల్ఏసీ వెంట ముందుకు వెళ్లే ప్రదేశాల్లో మోహరించేందుకు వాయురవాణా చేయగలిగిన ట్యాంకులు అవసరమవుతాయని భారత సైన్యం కోరుకుంటున్నది. ఈ రకం యుద్ధ ట్యాంకులను చాలా దేశాలు తయారుచేస్తున్నాయి.

సరిహద్దును కలుపుతూ చైనా విస్తృతమైన రహదారుల నెట్‌వర్క్‌ నిర్మించినప్పటికీ.. భారత్ మౌలిక సదుపాయాలు ఇంకా చైనా వేగంతో సరిపోలలేదు. భారత్ వ్యూహాత్మక ప్రదేశాలలో ఫార్వర్డ్ ఎయిర్ ఫీల్డ్ లను అభివృద్ధి చేసింది. 

ఇవే కాకుండా.. ఇతర అత్యవసర సేకరణలలో ఇజ్రాయెల్ నుంచి కొత్త ఆయుధాలు, ఎక్కువగా హెరాన్ మానవరహిత వైమానిక వాహనాలు, అదనపు సిగ్ సావర్ అటాల్ట్ రైఫిల్స్, ఉపరితలం నుంచి గాలికి పోర్టబుల్ రక్షణ క్షిపణులు, స్పైక్ ట్యాంక్ యాంటీ గైండెడ్ క్షిపణులు ఉన్నాయి. 

వాయు రవాణా ద్వారా ట్యాంకులను ఆపరేట్ చేసే ఏకైక దేశం రష్యా. బలహీనమైన కవచం ఉన్నప్పటికీ.. స్ప్రట్-ఎస్డిఎమ్ 1 వంటి ఆధునిక యుద్ధ ట్యాంకులతో పోల్చదగిన ఫైర్‌పవర్‌ను కలిగి ఉన్నది.