స్టేట్ బ్యాంక్ సిబ్బందికి ఎక్కడి నుంచైనా పని  

భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఉద్యోగులకు ఎక్కడినుండైనా పనిచేసే సౌలభ్యం కలిగించబోతున్నది. ఈ విధానం ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతంలో నుంచైనా పని చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌‌కు దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. 

కరోనా వైరస్ కారణంతో, తన ఖాతాదారుల ప్రయోజనార్థం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్‌‌పై ఎస్‌‌బీఐ దృష్టి సారించింది. దీని కోసం అంతర్జాతీయంగా అమలవుతోన్న ఉన్నత విధానాలను అమలు చేయడంలో భాగంగా బ్యాంక్‌‌ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ (డబ్ల్యూఎఫ్‌‌ఏ) మౌలిక సదుపాయాలను ఏర్పర్చుకొంటున్నది.

 తద్వారా ఎక్కడినుంచైనా క్రియేట్ చేయనుందని, ఏ లొకేషన్‌‌ నుంచైనా ఉద్యోగులు పనిచేసేలా అవకాశం కల్పించబోతోందని  65వ వార్షిక  సాధారణ సమావేశంలో ఎస్‌‌బీఐ ఛైర్మన్ రజ్‌‌నీష్ కుమార్ ప్రకటించారు. దీంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు తెలిపారు.

వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీ ద్వారా రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా చేయొచ్చని రజ్‌‌నీష్ కుమార్ చెబుతున్నారు. కరోనా టైమ్‌‌లో వ్యాపారాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడానికి ఇది కీలక కాంపోనెంట్‌‌గా ఉన్నట్టు పేర్కొన్నారు. 

ఎస్‌‌బీఐ యోనో ఇప్పటికే వాలెట్‌‌ షేరును పెంచుకుని, తన డిజిటల్ ఛానల్ ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించిందని బ్యాంక్ ఛైర్మన్ చెప్పారు.యోనోను మరింత విస్తరించాలని ఎస్‌‌బీఐ నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల్లో వినియోగదారుల నమోదు‌ను రెండింతలు చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. గృహ, కారు, వ్యక్తిగత బంగారు రుణాలు వంటి వాటి ద్వారా  మరింతగా ఈ యాప్‌‌ను బలోపేతం చేయాలని బ్యాంక్ చూస్తోంది.