సచిన్‌ పైలెట్‌ను బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌  

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. సిఎం అశోక్‌ గెహ్లాట్‌ వైఖరితో అలిగిన ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం బుజ్జగిస్తుంది. మరో సంక్షోభం కారణంగా ఏర్పడ్డ పరిస్థితి బిజెపికి అనుకూలంగా మారకుండా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. 
 
సోమవారం ఉదయం సిఎల్పీ సమావేశం నిర్వహించి 107 మంది అభ్యర్ధుల మద్దతు అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వానికే ఉందని ప్రకటించిన గెహ్లాట్‌ వర్గం వారందరు చేజారుకుండా ఉండేందుకు రిసార్టులకు పంపిస్తోంది. దానితో, రాజస్థాన్‌లో మరోసారి రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి.
 మరోవైపు సచిన్‌ పైలెట్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయని సూర్జేవాలా ప్రకటించారు. అంతకుముందు పైలెట్‌తో రాహుల్‌, ప్రియాంక, చిదరబరం, కేసి వేణుగోపాల్‌ మాట్లాడారు. బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

తనవైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సచిన్‌ పైలెట్‌ చెప్పుకున్నప్పటికీ అంతమంది ఆయన వర్గంలో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితిలో చాలా మంది అశోక్‌ గెహ్లాట్‌ వైపు చేరిపోయారని అంటున్నారు. సచిన్‌ చేతిలో 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవపైపు అశోక్‌ గెహ్లాట్‌ వద్దనూ 107 మంది ఎమ్మెల్యేలు లేరని, సిఎల్పీ సమావేశానికి 97 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని తెలిసింది. ఇద్దరు మంత్రులు కూడా సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. 
 
సచిన్‌ పైలెట్‌ వర్గాన్ని బుజ్జగించడంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఆశోక్‌ గెహ్లాట్‌ వర్గీయులే ఎక్కువమంది ఉన్నారని, చేపట్టబోయే విస్తరణలో సచిన్‌ పైలెట్‌ వర్గానికి ఎక్కువ అవకాశం కల్పించాలని అధిష్టానం అనుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  
తనను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగించడంతో పాటు కీలకమైన ఆర్ధిక, హోమ్ శాఖలు మంత్రివర్గంలో తన వర్గం వారికి ఇవ్వాలని సచిన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. సయోధ్య కుదరని పక్షంలో కాంగ్రెస్ నుండి బైటకు వచ్చి ప్రాంతీయ పార్టీ ఏరాటుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు పంపారు.