సుశాంత్ కేసులో సిబిఐ విచారణ కోరిన స్వామి 

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్  ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్ చేశారు. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్ భండారీతో సుశాంత్ కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 
 
ఈ కేసులో పోలీసుల వెర్షన్ సరైనదైనా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్లో పేర్కొన్నారు. యూట్యూబ్ లైవ్లో సుశాంత్ ఆత్యహత్య ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడతారని భండారీ ట్వీట్ చేశారు.
 
ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. అందులో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృత్తికి సంబంధించిన వారు ఉన్నారు. 
 
ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సుశాంత్కు బాజీరావు మస్తానీ, రామ్లీలా, పద్మావత్ సినిమాలను ఆఫర్ చేశారు. అయితే, డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ సినిమాలు చేయలేకపోయామని ఆయన వెల్లడించారు.
 
సుశాంత్ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే ఎవరైనా తనకు సాక్ష్యాధారాలతో సహా పంపొచ్చని భండారీ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, పుస్తక రచయిత తుహిన్ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు