వాట్సాప్ ద్వారా కోర్ట్ సమన్లు, నోటీసులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమన్లు, నోటీసులు వాట్సాప్​, ఈ-మెయిల్​, ఫ్యాక్స్​ ద్వారా అందజేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

న్యాయస్థానం కార్యకలాపాలకు సంబంధించి సాంకేతికతను వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు సమన్లు, నోటీసులను ఇక మీదట వాట్సాప్‌తోపాటు ఈ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా అందజేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

“నోటీసులు, సమన్లు, వాదనలకు సంబంధించిన ప్రతులు పంపేందుకు పోస్టాఫీసులకు వెళ్లడం సాధ్యం కాదని మా దృష్టికి వచ్చింది. ఇక మీదట అటువంటి సేవలను అందజేసేందుకు ఈ-మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్‌, టెలిఫోన్‌ మెస్సేజింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.” అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

నోటీసు అందిన వ్యక్తి దాన్ని చూసినట్టు రెండు నీలి రంగు టిక్‌ మార్క్‌లు వాట్సాప్‌ ద్వారా తెలుస్తుందని నోటీసులు జారీ చేయడం గురించి జస్టిస్‌ ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కరోనా వైరస్ కారణంగా హైకోర్టులు, ట్రెబ్యునల్స్‌లో అప్పీలు దాఖలు చేసే పరిమితి పొడిగింపుపై విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మే నెల నుంచి పిటిషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు కోర్టు అనుమతించింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికతను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహిస్తున్నారు.