భారత్ – చైనాలు శాంతియుతంగా ఉండాలి 

భారత్ – చైనాలు శాంతియుతంగా సహజీవనం సాగించాలని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా హితవు చెప్పారు. రెండు దేశాలకూ  ఒకరిని మరొకరు నాశనం చేసే శక్తి ఉందని ఆయన హెచ్చరించారు.   

లడాఖ్ ప్రాంతంలోని భారత్-చైనా సరిహద్దు ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ  ఇరుదేశాలు సరిహద్దు కారణంగా కయ్యానికి కాలుదువ్వుకోవద్దని స్పష్టం చేశారు. 
 
రెండు దేశాలూ శక్తిమంతమైన దేశాలని, పక్క దేశాన్ని దెబ్బతీయాలని ఏ దేశం అనుకున్నా రెండు దేశాలు నష్టపోతాయని హెచ్చరించారు.  పక్కపక్కనే ఉంటూ స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. 
 
‘భారత్-చైనాలు ప్రపంచంలోనే పురాతనమైన చారిత్రక మూలాలు కలిగిన దేశాలు. 100కోట్లకు పైగా జనాభా కలిగిన దేశాలు కూడా. ఇలాంటి దేశాల మధ్య ఇటీవలి కాలంలో అనేక విషయాల్లో పోటీ తత్వం మొదలైంది’ అని పేర్కొన్నారు. 
 
అయితే ఇరు దేశాలూ శాంతియుతంగా, ఆరోగ్యకరమైన పోటీ విధానాన్నే అవలంబించాలని చెప్పారు. ముఖ్యంగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతూ చైనా చరిత్రలో శాంతికి చిహ్నమైన బౌద్ధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తు చేశారు. 
 
అలాంటి బౌద్ధానికి ఆది గురువైన బుద్ధుని జన్మస్థలం భారతదేశం. ఈ రెండు దేశాలు శాంతికి మారుపేరుగా ఉంటూ పరస్పరం  సహకారంతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల’ని దలైలామా ఆకాంక్షించారు. 
 
ఇదిలా ఉంటే టిబెటన్ ఉద్యమం, ప్రభుత్వ పరిపాలనా విషయాలపై 2011 నుంచి దలైలామా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ భారత్-చైనా విషయంలో ఆయన స్పందించడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది,