దేశ వ్యాప్తంగా సంజీవయ్య శతజయంతి ఉత్సవాలు

దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి దాసరి శ్రీనివాసులు తెలిపారు. 

జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో నిర్వహించిన ఫౌండేషన్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సేవలు అందించారని కొనియాడారు.  హైదరాబాదులో బీ.హెచ్.ఈ.ఎల్,  బి.డి.ఎల్, హెచ్.ఏ.ఎల్,  ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు కర్మాగారం తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. 
 

కాపుల రిజర్వేషన్ ప్రతిపాదనలను తీసుకువచ్చి అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన సంజీవయ్య పేరును ఆయన సొంత జిల్లా  అయిన కర్నూలు జిల్లాకు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది.

ఆయన శతజయంతి ఫిబ్రవరి 14, 2021 నుండి ఫిబ్రవరి 14, 2022 వరకు నిర్వహించాలని  నిర్ణయించారు. ఇందుకొరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వాన్నిన్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో సంవత్సరం పొడవునా గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు చేయూత, వికలాంగులకు, వృద్ధులకు, సంక్షేమం కొరకే కాక పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టేందుకు తీర్మానించారు.

 
సంజీవయ్య స్వగ్రామం పెదపాడును సంజీవయ్య స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా హైదరాబాద్లోని ఆయన సమాధి ప్రాంతంను సంజీవయ్య పార్క్ గా అభివృద్ధి చేయగా, ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామని శ్రీనివాసులు పేర్కొన్నారు. 
 
మరో మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి కె.పి రామయ్య, ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ నేలపూడి స్టాలిన్ బాబు, మాజీ పట్టణాభివృద్ధిశాఖ రీజినల్ డైరెక్టర్,సంస్థ ట్రస్టీ యర్రా సాయి శ్రీకాంత్ సమావేశం లో పాల్గొన్నారు.