బీహార్ ఎన్నికలకు జోరుగా బిజెపి ఏర్పాట్లు 

బీహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అన్నిఏర్పాట్లు చేసుకుంటోంది. రానున్న కొన్నివారాల్లో సుమారు 70 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో జన సంవాద్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. జన సంవాద్‌ కార్యక్రమాలకు ఇప్పటికే అనుమతి లభించడంతో ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆ పార్టీ ఫేస్‌బుక్‌ లైవ్‌, జూమ్‌ యాప్‌లను విస్తృతంగా వినియోగించునున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో ప్రధాని మోదీ అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలను వీటి ద్వారా పార్టీ శ్రేణులు సామాన్యులకు వివరించనున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్దం చేసేందుకు అధిష్ఠానం కొన్నివారాల నుంచి వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తోంది. వర్చువల్‌ సమావేశాలతో పార్టీ శ్రేణులు పూర్తి ఊపులో ఉన్నారని ఆ పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో కనీసం 700మంది కార్యకర్తలు పార్టీతో అనుసంధానమై ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ సీనియ‌ర్‌ నాయకులు రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తూ ఎన్నికల సన్నాహాక ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర యాదవ్‌ జిల్లా కోర్‌ కమిటీలతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది నవంబర్‌లో బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆర్జేడీ, కాంగ్రెస్‌తోపాటు వామపక్ష పార్టీలను ఢీకొట్టనుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ కుమార్‌ ఎన్డీఏతో విభేదించి మహాగతాబంధన్‌ పేరుతో పలు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో ఆయన తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు.