కరోనా కేసుల్లో మూడో స్థానానికి భారత్‌

శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో రష్యాను దాటి భారత్‌ ప్రపంచంలోనే మూడోస్థానానికి చేరుకుంది. గత వారం రోజులుగా భారత్‌లో నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి 6,90,396 కేసులు నమోదయ్యాయి. రష్యాలో కేసుల సంఖ్య 6.8 లక్షల వద్ద ఉంది. 
 
ప్రస్తుతం 28 లక్షల పాజిటివ్‌ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 15 లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉన్న అమెరికా మినహా, బ్రెజిల్‌, రష్యాలలో నిత్యం దాదాపు ఏడు వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, భారత్‌లో ఆ సంఖ్య 25 వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.  
 
 తాజాగా గత 24 గంటల్లో అత్యధికంగా 24,850 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 613 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఈ స్థాయిలో మరణాలు, కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 
 
ఆదివారం నాటికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,90,396కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వీరిలో ఇప్పటి వరకు 19,268 మంది మఅత్యువాత పడ్డారు. 4,09,083 మంది కోలుకున్నారు. మరో 2,44,814 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
 
గత 24 గంటల్లో 14,856 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బాధితుల రికవరీ రేటు 60.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.9శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,48,934 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా 97,89,066 నమూనాలను పరీక్షించారు.

మహారాష్ట్రలో తాజాగా 7,074 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో కేసుల సంఖ్య 2 లక్షాలు దాటాయి. గత 24గంటల్లో రాష్ట్రంలో 295 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 8,671 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా మరణాల్లో 45 శాతానికి పైగా ఇక్కడే సంభవిస్తున్నాయి. దాదాపు 30 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. 

 
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరంలో కేసుల సంఖ్య 82,814గా నమోదైంది. ఇప్పటిదాకా 4,827 మంది మృత్యువాతపడ్టారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 2,505 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97,200లకు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,004 మంది మృత్యువాతపడ్డారు.