పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా 

గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు శుక్రవారం కరోనా వైరస్‌ నిర్థారణైంది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. తనకు పాజిటివ్‌ వచ్చిన మాట వాస్తవమేనని, హోం ఐసోలేషన్‌లో ఉండి కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటానని రోశయ్య వీడియో సందేశం ద్వారా తెలిపారు. 

ఆయన ఎంతకూ ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో వైద్యశాఖ అధికారులు కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఆయనే స్వయంగా మందీ మార్బలంతో కలెక్టరేట్‌కు వచ్చారు. నేరుగా ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ఎదురుగా కుర్చీలో కూర్చొన్నారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఆ అధికారి ఆయన్ను బయటకు వెళ్లమని చెప్పడమే కాకుండా ఆయన కూర్చున్న కుర్చీని కూడా బయట వేయించారు. అప్పటివరకూ ఆ ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్నవారంతా శానిటైజర్ల కోసం ఎగబడ్డారు. 

హోం క్వారంటైన్‌కు వెళ్లిన ఆ ఎమ్మెల్యే… తనకు కరోనా సోకిన మాట వాస్తవమేనని, అయితే తను పూర్తిఆరోగ్యంగా ఉన్నానని సోషల్‌ మీడియా ద్వారా వీడియో సందేశం పంపారు. ఇదిలాఉండగా, మరో ఎమ్మెల్యే గన్‌మన్‌కు పాజిటివ్‌ రావడంతో సిబ్బందితో పాటు ఆయనకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో శుక్రవారం ఒక్కరోజే 837 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరిలో 789మంది రాష్ట్రంలోని వారే కాగా, ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన 46మంది, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు కొవిడ్‌ బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 16,934కు చేరాయి. 

శుక్రవారం కర్నూలులో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 8మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 206కు పెరిగాయి. అనంతపురం జిల్లాలో 149,  కర్నూలు జిల్లాలో మరో 116మంది, తూర్పుగోదావరి జిల్లాలో మరో 108 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు.