కాన్పూర్ పోలీసులపై కాల్పుల వెనుక కుట్ర   

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా బిక్రూ గ్రామంలో శుక్రవారం ఉదయం రౌడీమూకలు పోలీసులపై జరిపిన కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతో సహా ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. 
 
ఈ ఘటన కుట్ర ప్రకారమే జరిగిందని ఆ రాష్ట్ర డీజీపీ హితేశ్‌ చంద్ర అవస్థీ ఆరోపించారు.  బిక్రూ గ్రామంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్నిఆయన పరిశీలించి మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు.
 
‘చీకటిలో వస్తున్న పోలీసుల దారికి అడ్డుగా ఎర్త్‌మూవర్‌ యంత్రాన్ని అడ్డుపెట్టి దుండగులు వారిపైకి కాల్పులు జరిపారు. దాడికి వెనుక కుట్రను ఛేదించేందుకు లక్నో, స్థానిక ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఎస్‌ఎస్పీ, ఎస్టీఎఫ్‌‌ బృందాలు దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి’ అని డీజీపీ తెలిపారు.
 
కాల్పులకు పాల్పడిన వారిలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు కాల్చి చంపినట్లు కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరికొంత మంది నిందితులకోసం గాలింపు కొనసాగుతుందని, చనిపోయిన ఇద్దరి మృతదేహాలను గుర్తించేందుకు గ్రామస్తులను పిలిపించినట్లు ఆయన తెలిపారు. 
 
తప్పించుకు తిరుగుతున్న మోస్టు వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా వారిపైకి దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దూబేపై 60కిపైగా క్రిమినల్‌ కేసులున్నాయి.