రూ 50-60 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు అవసరం  

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక రంగం వేగం పుంజుకోవాలంటే మౌలిక రంగాల ప్రాజెక్టులతో పాటుగా, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో రూ 50- 60 లక్షల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు రావలసిన అవసరం ఉందని కేంద్ర హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 

దేశీయ మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగాల్సిన అవసరం ఉన్నందున ఎఫ్‌డిఐల వల్ల దేశానికి ప్రయోజనం చేకూరుతుందని పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వూలో గడ్కరీ తెలిపారు.

కరోనా మహమ్మారి, దరిమిలా విధించిన వరస లాక్‌డౌన్‌ల కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ద్రవ్య లభ్యత చాలా అవసరం. అది లేకుండా ఆర్థిక వ్యవస్థ చక్రం వేగం పుంజుకోదని స్పష్టం చేశారు.

హైవేలు, విమానాశ్రయాలు, భూతల జలమార్గాలు, రైల్వేలు, లాజిస్టిక్ పార్కులు, బ్రాడ్‌గూజ్, మెట్రో మార్గాలతో పాటుగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇలు) పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలవని గడ్కరీ అభిప్రాయ పడడ్డారు. 

‘ఎంఎస్‌ఎంఇ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకులలో విదేశీ పెట్టుబడులు అవసరం. హైవేల రంగంలో విదేశీ పెట్టుబడులును తీసుకు రావడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఎంఎస్‌ఎంఇలతో పాటుగా వివిధ రంగాల్లోకి పెట్టుబడులను తీసుకు రావడానికి దుబాయి, అమెరికాకు చెందిన మదుపరులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు కూడా గడ్కరీ చెప్పారు.